ముక్కోటి ఏకాదశి 

మన సంప్రదాయంలో వైకుంఠ ఏకాదశికి అత్యంత ప్రాముఖ్యత ఉంది. దీనినే ముక్కోటి ఏకాదశి అని అంటారు. మూడు + కోటి = ముక్కోటి
ఈ రోజున వైష్ణవ ఆలయాలలో ఎదురుగా ఉన్న ద్వారాన్ని మూసేసి, ఉత్తర ద్వారాన్ని తెరిచి , ఆ ద్వారం నుండి స్వామి దర్శనాన్ని చేయిస్తారు. ఈ ఉత్తర ద్వారాన్నే వైకుంఠ ద్వారమని అంటారు.
ఇలా ఉత్తర ద్వార దర్శనం చేయడం వెనుక స్వామివారి లీలావిశేషాలు ఉన్నాయి.
శ్రీ మహావిష్ణువు కృతయుగంలో మత్స్య,కూర్మ,వరాహ, నారసింహావతారాలను, త్రేతాయుగంలో రామచంద్ర అవతారాన్ని ధరించి ,ద్వాపరయుగంలో కృష్ణ అవతారంలో దర్శనమిచ్చిన స్వామి, కలియుగంలో విరజానదీ మధ్యభాగంలో, సప్తప్రాకార సంశోభితమైన పరమపదంతో సహా శ్రీ దేవి భూ దేవిల సమేతుడై, విష్వక్సేనాదులు తనను కొలుస్తూ ఉండగా, శేషపాన్పుపై అర్చావతారుడై వెలసిన దివ్యగాధను, ముక్కోటి విశదపరుస్తూ ఉంటుంది. ఇందు వెనుక ఆసక్తికరమైన కధ ఉంది.
పూర్వం ఒకానొక సమయంలో ఇంద్రుడు, తన గొప్పదనాన్ని అందరితోపాటు త్రిమూర్తులకు, అష్టదిక్పాల్కులకు తెలియచేయాలన్న ఉద్దేశ్యంతో ఒక గొప్ప విందును ఏర్పాటు చేశాడు. ఆ విందుకు శ్రీ మహా విష్ణువు శ్రీ భూనీలా సమేతముగా, పరమశివుడు పార్వతీగంగా సమేతముగా, బ్రహ్మదేవుడు శ్రీ వాణీ సమేతముగా విచ్చేశారు. ఇక దిక్పాలకులు ,ముక్కోటి దేవతలు, సకలలోక వాసులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేసారు. వారి ఆగమనముతో స్వర్గలోకమంతా కోలాహలంగా ఉంది. అప్పుడు పార్వతిదేవి ఇంద్రునితో ," నీ సభలో అత్యంత ప్రతిభాశాలురైన నాట్యమణులున్నారని ఏర్పాటు చేస్తే, అది చూసి మేమంతా ఆనందిస్తాము కదా" అని అడుగగా ఇంద్రుడు తక్షణమే ఊర్వశి,మేనక,తిలోత్తమలను పిలిపించి నాట్య ప్రదర్శనలను ఇప్పించాడు. వారి నృత్యంతో అంతగా సంతృప్తి చెందని పార్వతీదేవిని చూసి ఇంద్రుడు వినయంతో ఒక్కసారి రంభ నృత్యం చూసి వారి అభిప్రాయాన్ని తెలియచేయమని కోరాడు.
అనంతరం సభావేదిక చేరుకున్న రంభ ముందుగా పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి, అనంతరం లక్ష్మీ నారాయణుల పాద పద్మములకు, వాణిపద్మజులను సేవించి, సభికులకు అభివందనం చేసి, సరస్వతీ భరతభూషణులను స్తుతించి నాట్యం మొదలు పెట్టింది. ఆమె నాట్యానికి సభికులంతా ముగ్ధులు అయ్యారు. రంభ నాట్యకౌసల్యాన్ని చూసి మెచ్చిన పార్వతీ దేవి నవరత్నఖచిత బంగారు గండపెండేరాన్ని,లక్ష్మీ దేవి బంగారు కడియాన్ని,సరస్వతి దేవి రత్న ఖచిత దండ కడియాన్ని, రంభకు బహూకరించారు. ఇంకా చాలా మంది దేవతలు రంభకు బహుమతులు ఇచ్చారు.
రంభ తన గౌరవాన్ని నిలబెట్టిందని తలచిన ఇంద్రుడు, ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందుకు రంభ ఇంద్రుని వలన తనకు పుత్రుడు కలిగేటట్లు అనుగ్రహించమని కోరింది. అది విన్న సభాసదులందరూ కరతాళధ్వనులతో తమ ఆమోదాన్ని తెలిపారు. ఆమె కోరిక తీరేందుకు ఇంద్రుడు సకల దేవతల సాక్షిగా రంభ సహితంగా నందన వనానికి వెళ్ళాడు.
ఈ వ్యవహారమంతా దేవగురు బృహస్పతికి నచ్చలేదు. ఆవేశాన్ని అణుచుకోలేకపోయిన దేవగురువు ,నేరుగా నందన వనానికి వెళ్ళి,సరస సల్లాపాలలో మునిగి ఉన్న ఇంద్రుని పైకి తన కమండలాన్ని విసిరిగొట్టాడు. అప్పటికీ అతని ఆవేశం చల్లారకపోవడంతో దేవేంద్రుని రత్నకిరీటం కిందకు పడేంతగా కొట్టాడు. ఇంద్రుడిని భూలోకంలో ఆటవిక బందిపోటుగా జన్మించమని శపించాడు. తన వలన ఇంద్రుని శపించవలదని రంభ కోరినప్పటికి బృహస్పతి వినకపోవడంతో, రోషావేశపూరితమైన రంభ దేవ గురువుని నీచ జన్మ ఎత్తమని శపిస్తుంది.
ఈ లోపు అటుగా వచ్చిన నారదుడు విషయాన్ని గ్రహించి, ముగ్గురుని త్రిమూర్తుల వద్దకు తీసుకొని వెళ్ళాడు. ఈ శాపాలు అందరు అనుభవించవలసిందే అని తెలిశాక, ఇంద్రుడు భోరున విలపించసాగాడు. దీనముగా వేడుకున్నాడు.
ఇంద్రుని దుఃఖాన్ని చుసిన కరుణాపూరితుడైన విష్ణుభగవానుడు అతనిని ఓదార్చి, తను భూలోకంలో అవతరించి శాపవిమోచనాన్ని ప్రసాదించగలనని చెప్పాడు. విష్ణువు మాటలు విన్న లక్ష్మీ దేవి " స్వామి గురువుశిష్యులు ఇద్దరు పరస్పర వివేకశూన్యులై శపించుకుంటే , ఆ శాపవిమోచనానికి మీరు భూలోకంలో అవతరించడం దేనికి...రామ అవతారంలో పడిన కష్టాలు చాలవా? " అని అడిగింది.
తాను ద్వాపరయుగాంతంలో దుర్వాసుని శాపంవల్ల బాధితురాలైన ఓ గొల్ల భామకు వరం ఇవ్వడమే కారణమని పేర్కొన్నాడు.
అలా శ్రీ మహవిష్ణువు భూలోక అవతార వెనుక చాల కథలు ఉన్నాయి...అందులో ఇది ఒకటి!