దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి:

లోకసంరక్షనార్ధం తారకాసురున్ని వధించేందుకై దేవతలకోరిక మేరకు లోకనాయకుడు పరమశివుడు అంశతో మార్గశిర శుద్దషష్టి నాడు జన్మించారు సుబ్రహ్మణ్య స్వామి. ఈ మార్గశిర షష్టి ని "సుబ్రహ్మణ్య షష్టి" లేదా "స్కంద షష్టి" గా పిలువబడుతోంది.
పిలువబడుతోంది.

దేవసేనాధిపతి సుబ్రహ్మణ్య స్వామి:
పూర్వము "తారకాసురుడు" అనే రాక్షసుడు శివుని మెప్పుకై తీవ్రముగా తపస్సు చేసి తపోఫలముగా (అర్భకుడైన) బాలునితో తప్ప ఇతరులతో చావు లేని వరము పొందుతాడు. తదుపరి తాను అజేయుడునని, అమరుడునని వరగర్వముతో ముల్లోకాలను గజగజలాడించగా దేవతలు విష్ణువు వద్దకువెళ్ళి మొరపెట్టుకుంటారు. తదుపరి ఆ శ్రీహరి వరమిచ్చిన ఆ పరమశివుని పుత్రుని వలెనే తారకాసురుని మరణం సంభవిస్తుందని తెలిపి ఆ ఆదిదేవునివద్దకు వెళ్లి సమస్యను విన్నవించుకోమని సెలవివ్వగా దేవతలు పరమశివుని వద్దకు వెళ్తారు.

పరమశివుడు సమస్య తీవ్రతను గ్రహించి తన అంశతో సుబ్రహ్మణ్య స్వామి జన్మకు కారకులయ్యారు.

సుబ్రహ్మణ్యస్వామి జన్మ వృత్తాంతం :
పురాణగాధల ప్రకారం పరమశివుని దివ్యతేజస్సు వాయుదేవునిలో ప్రవిశింపబడి తిరిగి వాయుదేవుడు అగ్నిదేవునిలో ప్రవేశింపబెడతాడు. అగ్నిదేవుడు కూడా శివతేజస్సును తాళలేక గంగానదిలో విడిచిపెట్టగా రుద్రతేజం ప్రవాహంలో రెళ్ళు వనంలో (శరవనం ) చిక్కుకొని ఆరు ముఖాలు (షణ్ముఖాలు) పన్నెండు చేతులతో ఓ బాలుడు జన్మించెను. అతడే "సుబ్రహ్మణ్యస్వామి" లేదా "కుమార స్వామి"

సుబ్రహ్మణ్యస్వామి పేర్లు :
కుమారస్వామికి గల విశిష్ట నామాలు వాటి వివరణ ఈ క్రింది విధంగా వున్నవి.

షణ్ముఖుడు --------------> ఆరు ముఖాలు కలవాడు.
స్కందుడు ----------------> పార్వతీదేవి పిలిచిన పేరు.
కార్తికేయుడు --------------> కృత్తికానక్షత్రాన జన్మిచినందుకు లభించిన నామం.
వేలాయుధుడు ------------> శూలాన్ని ఆయుధముగా కలిగిన వాడు.
శరవణుడు -----------------> శరవణం (రెల్లు వనం) లో జన్మించెను కాబట్టి.
గాంగేయుడు ---------------> గంగానది ప్రవాహంలో వఛ్చినవాడు.
సేనాపతి -------------------> దేవతలకు సేనాధిపతి కనుక.
స్వామినాధుడు -----------> శివునకు ప్రణవ మంత్రము అర్ధాన్ని చెప్పినాడు కనుక.
సుబ్రహ్మణ్యుడు -----------> బ్రహ్మ జ్ఞానము కలిగినవాడు.
మురుగన్ -----------------> ఈ తమిళ నామాని అర్ధం "అందమైన వాడు"

తారకాసుర సంహారం:
కుమారస్వామిని దేవతలు తమ సేనాధిపతిని చేసారు. కుమారస్వామి తారకాసురిని సంహరించేందుకు భీకరయుద్దాన్ని ఆరు రోజుల పాటు చేసి వధించి లోకాన్ని, దేవతలను కాపాడి అందరి మన్ననలు పొందిన సుబ్రహ్మణ్యస్వామి దేవసేనాపతి గా కీర్తింపబడ్డారు.

సుబ్రహ్మణ్య కావడి:
విశేషముగా సుబ్రహ్మణ్య షష్ఠి రోజున భక్తులు తెల్లవారే లేచి శిరస్నామచారించి పాలు, పంచాదరాలతో నిండిన కావిడలను ధరించి సుబ్రహ్మణ్య స్వామికి సమర్పిస్తారు. దేవాలయాలను దర్శించి భక్తిశ్రద్ధలతో అష్టోత్తర శతనామాల పూజలు చేస్తారు. భక్తులు కావడిలతో తెచ్చిన పంచదార, పాలను స్వామికి సమర్పించుకుంటారు. అయితే ఈ కావడిలోని వస్తువులు భక్తుల మొక్కుల బట్టి ఉంటాయని తెలుస్తున్నది. ముఖ్యముగా ఈ ఆచారము తమిళనాడు రాష్ట్రములో విశేషముగా ఆచరణలో ఉన్నది.

శ్రీ వల్లిదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణము:
స్కంద షష్టి రోజునాడు సుబ్రహ్మణ్య దేవాలయాలలో "శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి" కళ్యాణం నిర్వహిస్తుండడం పరిపాటి. ఈ వివాహాన్ని వీక్షించిన వివాహంకాని యువతీయువకులకు ఆటంకములు తొలగి వివాహాలు జరుగుతాయని చెబుతుంటారు. అంతేకాకుండా వీరికి సత్సంతానము కలుగుతుందని పెద్దలు చెబుతున్నారు.

సుబ్రహ్మణ్య షష్ఠి నాడు పాటించాల్సిన నియమాలు :

సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి.
నదీస్నానం ఆచరించాలి (సమీపాన నది ఉంటే) లేదా శిరస్నానం చేయాలి. 
సుబ్రహ్మణ్య స్వామి కి పాలు నైవేద్యంగా సమర్పించాలి. 
అచంచల భక్తి భావంతో సుబ్రహ్మణ్య స్వామి గాధలు చదవాలి. 
సుబ్రహ్మణ్య స్వామి కీర్తనలు ఆలాపన చేయాలి.
దగ్గరలోని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించి పూజలు చేయాలి.
వీలైనంత దానధర్మాలు చేయాలి.
రోజంతా ఉపవాస దీక్ష ఆచరించాలి.

స్కంద షష్టి పూజ ఫలితం:
## విశేషించి ఈ రోజు సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసినా, కావడి సమర్ఫిన్చినా సత్సంతాన ప్రాప్తి మరియు వారి కుటుంబములో మరియు రాబోయో తరాలవారికి కూడా సంతాన లేమి లేకుండా వంశవృద్ధి జరుగుతుందని నమ్మకము. అందుకే సుబ్రహ్మణ్యస్వామి ఆలయాలు ఎక్కువగా మహిళలు సందర్శిస్తుంటారు.

## ఈ రోజు పుట్టలో పాలు పోసిన భక్తులకు సర్పదోషాలు తొలగిపోతాయని నమ్మకం.

## స్కంద షష్ఠి నాడు సుబ్రహ్మణ్య కళ్యాణం జరిపించు భక్తులకు సకలశుభాలు కలుగుతాయని ప్రతీతి.