శివుని ఉపాసించు వారు ధన్యులు. కృత కృత్యులు. వారి జన్మ సఫలమగును. వారి కులము ఉద్ధరింపబడును. సదాశివ, శివ అంటూ శివనామమును జపించు వానిని చెదలు నిప్పును వలె, పాపములు స్పృశించజాలవు. ఓ శివా! నీకు నమస్కారము అని పలికే నోరు పాపములనన్నిటినీ పోగొట్టే పవిత్ర తీర్థము. ఎవనియందు అత్యంత శుభకరములగు శివనామము, విభూతి, రుద్రాక్షలు అనే మూడు ఉండునో, అట్టివాని దర్శన మాత్రముచేత త్రివేణీ సంగమములో స్నానము చేసిన ఫలము లభించును. వాని దర్శనము పాపములను పోగొట్టును. ఎవని లలాటముపై విభూతి లేదో, ఎవని శరీరమునందు రుద్రాక్ష ధరింపబడదో, ఎవని పలుకులు శివనామ భరితములు కావో అట్టి వానిని అధముని వలె త్యజించవలెను. శివనామము గంగ వంటిది. విభూతి యమున వంటిది. రుద్రాక్ష సర్వపాపములను పోగొట్టే సరస్వతీ నది వంటిది.
ఈమూడు ఎవని శరీరమునందు గలవో, వాని పుణ్యమును ఒకవైపు, త్రివేణీ సంగమ స్నానము వలన లభించు పుణ్యమును మరియొకవైపు ఉంచి విద్వాంసులే కాక పూర్వము బ్రహ్మ కూడా లోకహితమును కోరి పోల్చి చూసెను. రెండింటి ఫలము సమానముగనుండెను. కావున విద్వాంసులు అన్నివేళలా ధరించవలెను. ఆనాటి నుం డియూ బ్రహ్మ, విష్ణువు మొదలగు దేవతలు మూడింటిని ధరించుచుండిరి. వీటి దర్శనము పాపములను పోగొట్టును.
శివనామమనే దావాగ్ని యెదుట మహాపాపములనే పర్వతములు తేలికగా బూడిదయగునను మాట ముమ్మాటికీ సత్యము. సంసారమునకు మూలమైన పాపములు శివనామము అనే గొడ్డలితో నిశ్చయముగా నాశమును పొందును. శివనామమునందు భక్తి కలిగిన మహాత్ములకు ముక్తి శీఘ్రముగా లభించును. అనేక జన్మములు తపస్సు చేసిన వానికి పాపములన్నిటినీ పోగొట్టే శివనామమునందు భక్తి కుదురును. ఎవనికి శివనామము నందు అతిశయించిన నిరంతర భక్తి కుదురునో వానికి మాత్రమే మోక్షము సులభమగుననియు, ఇతరులము దుర్లభమనియు శివపురాణమునందు చెప్పబడినది.