హరిదాసు అంటే ఎవరు?

హరికధ అంటే ఏంటి?*


”శ్రవణం కీర్తనం విష్ణో: స్మరణం పాదసేవనం

అర్చనం వందనం దాస్యం సఖ్య మాత్మనివేదనం”

అని భాగవతం భక్తిని తొమ్మిది విధాలుగా వర్గీకరించింది. ఇందులో శ్రవణం అనే ప్రక్రియ మొట్టమొదటి స్థానాన్ని ఆక్రమించింది. శ్రవణ నాడు లకు, హృదయ నాడులకు దగ్గరి సంబంధం ఉండడం వల్ల విన్నది తొందరగా హృదయానికి హత్తుకుంటుంది. ఆనాటి పాలకులు కూడా ఇష్టకథలు చెప్పించుకొని వినేవారని శాసనాలూ, సాహిత్యం చెబుతున్నాయి.

”హరి” అనే శబ్దానికి విష్ణువు, ఇంద్రుడు, సూర్యుడు, యముడు మొదలైన అనేక అర్థాలున్నప్పటికీ ”విష్ణువు” అనే పదమే అధిక ప్రాముఖ్యత కలిగి ఉంది. తక్కిన అర్థాలు అల్ప ప్రసిద్ధాలు. ”కథ” అంటే ప్రదర్శించు, ప్రకటించు, భావించు, వర్ణించు, వ్యాఖ్యానించు అనే నానార్థాలున్నాయి. కథ అనే శబ్దానికి ”కథ’ మూల ధాతువు.

హరి సంబంధమైన కథను ”హరికథ” అంటున్నాం మరి శివ సంబంధమైన కథను ”శివకథ” అనవలెనా? అంటే అవసరం లేదు. ఎందుకంటే ‘హరి’ అనేది దేవతా సామాన్య వాచకం. అందుకే అన్ని దేవతలకు సంబంధించిన కథలనూ ”హరికథ’లుగా చెప్పవచ్చు. తొలుత కేవలం విష్ణుసంబంధమైన కథలనే చెప్పడం వల్ల ఆ పేరు వచ్చి ఉండవచ్చు.కానీ నేడు ”హరికథ’ అనేది ఒక సంజ్ఞ. పారిభాషిక పదం. ఒక కళారూపం. హరికథ మొదట విష్ణువుకు మాత్రమే పరిమితమైనా కాలక్రమాన బ్రహ్మాది దేవతలు స్థానిక దేవతలు, మహాపురుషులు, జాతినేతలు, చారిత్రక వీరులు, పతివ్రతాశిరోమణులు మొదలుకొని బాబాలు, స్వాముల వరకూ వ్యాపించింది. భక్తిరస ప్రధాన పురాణ గాథలలో ఏదైనా ఒకటి ఎత్తుకొని, దానిని శ్రోతల మనస్సుల నాకర్షించునట్లు గద్యములు, పద్యములు, గానములు మొదలగు వాని సమ్మేళనంతో ప్రవచించుట హరికథా కాలక్షేమ మంటారు” అని జయంతి రామయ్య పంతులు నిర్వచించారు. హరికథ ఈనాటిది కాదు. పురాణకాలంలోని నారదుడు మొట్టమొదటి హరిదాసు అటు తరువాత ఐతిహాసిక యుగంలోని కుశలవులకు నారదుడే గురువై వారితో హరికథలు చెప్పించాడు. ఆదిభట్ల నారాయణ దాసు పూర్వం కూడా హరికథ ప్రచారంలో ఉండింది. కానీ దాసుగారు తమ అభినయ నృత్య గానాలతో సంగీత సాహిత్యాలను మేళవించి, సునిశిత హాస్య చతురతతో కథను నడిపిస్తూ హరికథకు ఒక నిర్దిష్టమైన రూపాన్నీ, విశేష ప్రచారాన్నీ కల్పించారు.

హరికథకుడు సాధారణంగా పురాణంలోని ఏదో ఒక సంఘటననో లేదా ప్రముఖులు రచించిన ఏ కావ్య ఘట్టాన్నో తీసుకుని దానికి తగిన సంగీతాన్ని సమకూర్చుకొని కథనం సాగిస్తాడు. మామూలు కథకుడైతే మూల కథను మాత్రం ఒప్పజెప్పుతాడు. ప్రతిభావంతుడైన కథకుడైతే స్థూలంగా మూలకథను అనుసరిస్తూ ఆయా సమయాలలో ఇతర కవులు రచించిన పద్యాలను, కీర్తనలను చేర్చి, వాటికి కొంత స్వంత కల్పనను జోడించి, అనువైన చోట్ల హాస్య చతురతను మేళవించి, అవసరమైన చోట్ల లయబద్ధంగా స్మరిస్తూ తన హావ భావ విలాసాలతో ప్రేక్షకులను అలరిస్తాడు. కథకుడు ప్రేక్షకుల స్థాయిని బట్టి తన కథా స్థాయిని కూడా మరుస్తుంటాడు. ప్రేక్షకులలో పండితులున్నప్పుడు అనేకానేక శాస్త్రోదాహరణలతోనూ, సందర్భోచిత ఇతర కవుల చాటువులతోనూ, ప్రసిద్ధ వాగ్గేయకారుల కీర్తనల తోనూ కథను పండిత ప్రియంగా నడిపిస్తాడు. అదే సంగీతజ్ఞు లున్న సభలో అనేక క్లిష్టరాగాలతో, సంక్లిష్ట తాళ, జాగాలతో సంకీర్తనలు, కృతులు, తరంగాలతో స్వరాభిషేకం చేస్తూ రసరమ్యంగా లయాత్మకంగా కథను నడిపిస్తాడు.

సాధారణంగా కథకులు మూడు రకాలు

1. కులవృత్తిగా కలవారు.

2. ఉపవృత్తిగా గలవారు

3. ఔత్సాహికులు.

నేడు కులవృత్తిగా గల అనేక కథకులు తమకు ఎదురవుతున్న అనాదరణ వల్ల, ఆర్థిక ఇబ్బందుల వల్లా ఇతర వృత్తులలోకి వెళ్లిపోతున్నారు. పూర్వం నుండీ మామూలుగా కథకునికి ఇచ్చే నూటపదహార్లూ. వెయ్యి న్నూట పదహార్లూ నేడు సరిపోవడం లేదు. కథకుడూ, వాయ

ిద్యాల వారూ అందులోనే పంచుకోవాలి. ఒక్కొక్కప్పుడు ఒప్పందం చేసుకున్న మొత్తం కంటే, చదివింపులద్వారా, హారతి పళ్లెం ద్వారా ఇంకా ఎక్కువ మొత్తమే రావచ్చు. కానీ అది ఆ కథకుడి అదృష్టం మీదా, ఆవూరి ప్రజల కళాభిమానం మీదా, వారి ఔదార్యం మీదా ఆధారపడి ఉంటుంది. కథకునికీ, వాయిద్యాల వారికీ ఒద్దికలు ఉంటే ఆ కథ మరింత రంజుగా ఉంటుంది. కానీ మామూలుగా కథకునికి వచ్చే కొంతమొత్తంలోనే వాయిద్యాల వారిని వెంట తీసుకు పోవడం సాధ్యం కానిపని. అందుకే కొందరు వాయి ద్యం లేకుండానే కథనం సాగిస్తున్నారు. ఇంకొంతమంది ఆగ్రామంలోనే ఎవరైనా వాయిద్యాలవారుంటే వారితో సరిపెట్టుకుంటారు. శృతి పెట్టెతో సరిపెట్టుకునే వారు కొందరు. కొంతపెద్ద మొత్తంలో డబ్బు తీసుకొని కథ ఏర్పాటు చేసుకునే వారు వాయిద్యాలను వెంట తీసుకుపోతున్నారు. ఇంకా రంజుగా కథ చెప్పాలనుకునే వారు హార్మోనియం, తబలా, వయోలిన్‌, మృదంగం, ఘటం ఇన్నింటినీ ఏర్పాటు చేసుకుని మరీ కథ చెబుతున్నారు. హార్మోనియంలో ప్రావీణ్యం గల కథకులు కొందరు కీర్తనగానీ, పద్యంగానీ వచ్చినపుడు బల్లమీద పెట్టుకున్న హార్మోనియం వాయిస్తూ కథ చెప్పడం కూడా జరుగుతున్నది. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్‌ హరికథలను, హరిదాసులను పరిరక్షించడంలో తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఈ మధ్యన ఈ ప్రాచీన కళారూపాన్ని కాపాడుకోవాలని కృషి చేయడం చాలా సంతోషించదగ్గ విషయం. ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక శాఖవారు ఈ మధ్యన ”మహిళా హరికథా వారోత్సవాల”ను ఘనంగా నిర్వహించడం ముదావహం. ఈ క్లిష్ట రూపక ప్రక్రియను కాపాడు కోవడం మన అందరి బాధ్యత. ముందు తరాలవారికి దీనిని అపురూపంగా అందించడం మన కర్తవ్యం. హరికథ ఒక నూతన విద్యా ప్రదర్శనం. దీనికి ప్రశస్తమైన సంగీతం. సాహిత్యం, చక్కని నృత్యం, అభినయం, శ్రోతల మనస్సుల కింపైన మాటలు, సందర్భానుసారమైన ఛలోక్తులు, హాస్య ధోరణి, దేశకాల పరిస్థితులకు అవసరమైన సామాజిక చైతన్య ధోరణి అన్నింటికన్నా రసమస్యమైన రూపం కావలసిన అంగములు. హరికథాగానం యుగయుగాల నుండీ తరతరాల నుండీ ప్రజానీకానికి భక్తిభావ ప్రభోధికంగా ప్రచారితమవుతున్న ఒక ఆధ్యాత్మిక లలిత కళా సందేశం. ఇది ఒక సారస్వత విజ్ఞాన సర్వస్యం. ఇతర కళారూపాలైన నాటకం గానీ, యక్షగానంగానీ బుర్రకథ గానీ రక్తి కట్టించుట అంత కష్టమైన పనేమీ కాదు. వీటిలో ఇతర నటీనటుల తోడ్పాటు, రంగాలంకరణ, ఆహార్యం తోడుగా ఉంటుంది. వీటి సాయంతో నవరసాలను సులభంగా మెప్పించవచ్చు. కానీ హరికథలో అన్ని పాత్రలనూ ఒక్కడే ధరించాలి. అవిశ్రాంతంగా మూడు గంటలపాటు ఒక్కడే ప్రజలను రంజింప చేయాలి. సంగీత సాహిత్యాలనే రెండు ప్రధాన చక్రాల మీద హరికథ అనే బండిని నడుపుతూ ప్రేక్షకులకు వేసరిక రాకుండా నృత్యం, హాస్యం అనే ప్రదేశాల వద్ద ఒకింత మజిలీ నిర్వహిస్తూ, సామాజిక చైతన్యం కలిగిస్తూ, వేదాంత మార్గం లో ప్రయాణం చేస్తూ, భక్తి అనే గమ్యాన్ని తాను చేరి ప్రేక్షకులను గూడా తనతోపాటూ తీసుకెళ్లే వాడే హరిదాసు..