బోగిపళ్ళు


రేగు పళ్ళని సంస్కృతంలో బదరీ ఫలాలంటారు. పూర్వం నర నారాయణులు బదరీ వనంలో తపస్సు చేశారు. అక్కడ తపస్సు చేసుకుంటూ వాళ్ళు రోజూ చుట్టుపక్కలవున్న చెట్లనుంచి ఒక్క రేగు ప

ండుని ఆహారంగా తీసుకునే వాళ్లు. సాక్షాత్తూ నారాయణుడు అక్కడ తిరుగుతూ, రేగు పళ్ళని తింటూ, ఆ ప్రదేశాల్నీ, వృక్షాలనీ, వనాన్నీ స్పృశించి ఆశీర్వదించారు. ఆ ప్రదేశమే బదరీ క్షేత్రం.

బదరీ ఫలాలు నారాయణుడిచే స్పృశించబడి సాక్షాత్తూ ఆ దేవ దేవుని ఆశీస్సులు పొందాయి కనుక ఆ పళ్ళను ఎవరు వాడినా సిరిసంపదలు, భోగ భాగ్యాలతో తులతూగుతారంటారు. భోగినాడు పెద్దవారు పిల్లలకి భోగి పళ్ళుపోసి ఆశీర్వదిస్తారు. వారి ఆశీర్వచనాలతోబాటు ఆ నారాయణుడి ఆశీస్సులు కూడా వారికి అందుతాయనే నమ్మకంతో.రేగి పండు భారత ఇతిహాసంలో.... భారత నాగరికతలో..... పూజలలోను పాలు పంచుకున్న అతి కొద్ది పండ్లలో రేగి పండు ఒకటి. రేగి పండును బదరీ ఫలం అంటారు. రామాయణంలో శబరి శ్రీరామునికి తినిపించింది ఈ ఫలాలనే. సంక్రాంతి నాడు బోగి పండ్లు పోయాలి అని అంటుంటారు అవి కూడ రేగి పండ్లే.

సంక్రాంతి పండుగకు వచ్చే ముందురోజున "భోగి" పండుగ జరుపుకుంటాం. సూర్యుడు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి ప్రవేశించే ముందు రోజునే భోగి అంటారు. పంట మంచి దిగుబడి సాధించిన రైతుల ఇళ్లల్లో ధన, ధాన్యలక్ష్మిలు కొలువై ఉంటారు కనుక వారు ఈ పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.

మూడు రోజులపాటు జరిగే ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో వైభవంగా నిర్వహిస్తారు. భోగిరోజున తెల్లవారకముందే గ్రామంలోని నాలుగు వీధుల కూడలిలో భోగిమంటలు వెలిగిస్తారు. ఇంట్లో పేరుకుపోయిన పాత పుల్లలు, చెక్కముక్కలన్నీ తీసుకొచ్చి ఈ మంటల్లో వేస్తారు.

భోగి మంటల పరమార్థం ఏమిటంటే... ఆ మంటల ద్వారా చలిని పారద్రోలటమేగాకుండా.. ఆ రోజు నుంచి జీవితాన్ని కొత్తవాటితో ప్రారంభించాలని అర్థం చేసుకోవాలి. అలాగే మనసులో పేరుకుపోయిన చెడును కూడా విడిచిపెట్టాలని, అందులోని ఏకీకరణ భావాన్ని కూడా వారు అర్థం చేసుకోమని సూచిస్తుంటారు.
ఇక భోగి రోజు సాయంత్రంపూట అందరి ఇళ్లలోనూ ఏర్పాటుచేసే బొమ్మల కొలువంటే పిల్లలకు భలే సరదా. ఈ బొమ్మల కొలువుల్లో పిల్లలు వారి దగ్గర ఉండే అన్నిరకాల ఆట వస్తువులను ఉంచి సంతోషిస్తారు. అలాగే ఈ సందర్భంగా తల్లులు పేరంటాన్ని ఏర్పాటు చేసి ఇరుగుపొరుగు మహిళలకు పసుపు కుంకుమలు అందిస్తారు.
దీనికి ప్రతిగా వారంతా రేగిపళ్లు, పువ్వులు, రాగి నాణాలను చిన్నారుల తలలపై ధారగా పోస్తారు. ఆ తర్వాత వారిని మనస్ఫూర్తిగా దీవించి వెళతారు.

రైతుల ఇళ్లల్లో ధాన్యలక్ష్మి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి, ఈ మూడురోజులపాటు కొత్తబట్టలను కొనుక్కుని కట్టుకోవటంతోపాటు, అనేక పిండివంటలతో విందు చేసుకుంటారు.

బోగిపళ్ళు: బోగి పండ్లు అంటే రేగుపండ్లు. ఇది సూర్యునికి ప్రీతిపాత్రమైన పండుగ. సూర్యుని రూపం, రంగు, పేరు కలిగిన రేగుపండ్లతో నాణేలను కలిపి పిల్లల తలపై పోస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పిల్లలపై ప్రసరించి ఆరోగ్యం కలగాలనే సంకేతంతో బోగిపండ్లు పోస్తారు.