పూజ సంకల్పం - పరమార్థం

పరమాచార్య స్వామివారు చిత్తూరు దగ్గరలో మకాం చేస్తున్నారు. ఆరోజు తెలుగు నూతన సంవత్సరం. మహాస్వామివారి దర్శనానికి చాలామంది భక్తులు వచ్చారు. దర్శనం అలా కొనసాగుతూనే ఉంది. దాదాపు మధ్యాహ్నం రెండు గంటలు కావొస్తోంది కాని పరమాచార్య స్వామివారు ఇంకా మొదటి కాల పూజ కూడా ప్రారంభించలేదు. స్వామివారి ఆంతరంగిక శ్రీమఠం సేవకులొకరు అప్పటికే పూజకు ఆలస్యమైందని వినయంగా మనవి చేశారు.
వెంటనే మహాస్వామివారు, “మనం ఈ నూతన సంవత్సరాన్ని చంద్రమౌళీశ్వర పూజతో ప్రారంభిద్దాము. పూజని సంకల్పంతో మొదలుపెడదాము” అని చెప్పి పూజకు ఉపక్రమించారు.
అక్కడ కూర్చున్న అంతమంది భక్తులను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశారు మహాస్వామివారు. “ప్రతిరోజూ చేసే చంద్రమౌళీశ్వర పూజలో చదివే సంకల్పం యొక్క అర్థం పరమార్థం ఎవరికైనా తెలుసా?” అని.
ఒకరు చెప్పారు అది పరమాచార్య స్వామివారికోసం అని. మరొకరు పరమాచార్య మరియు పుదు పెరియవ కోసం అని చెప్పారు. వేదముల యొక్క సంరక్షణ కోసం అని మూడవ వ్యక్తి అభిప్రాయపడ్డాడు. నాల్గవ వ్యక్తి ప్రముఖ శ్లోకాన్ని అనుసరించి, అది పాలకులు, బ్రాహ్మణులు, గోవుల యొక్క క్షేమం కోసం అని తెలిపాడు.
అప్పుడు మహాస్వామివారు సంకల్పం చెప్పే శాస్త్రి గారిని పిలిచి సంకల్పం యొక్క అర్థము, ఉద్దేశ్యము అనువదించి అందరికి తెలుపవలసిందిగా ఆజ్ఞాపించారు. అపుడు మేము, అక్కడున్న అందరమూ అర్థం చేసుకున్నాము. శ్రీమఠంలో రోజూ జరిగే పూజ యొక్క ప్రయోజనం కుల, మత, వర్ణ, లింగ, ధనిక, పేద వివక్ష లేకుండా సర్వ మానవాళి కోసం.
--- ప్రొ. యస్. కళ్యాణరామన్, న్యూరోసర్జన్, చెన్నై. “మూమెంట్స్ ఆఫ్ ఎ లైఫ్ టైం” నుండి
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।