మార్గశిరలక్ష్మివ్రతం:..!

మార్గశిర మాసంలోవచ్చే గురువారం నాడు, చేసే 
ఈ పూజను "మార్గశిరలక్ష్మివారవ్రతము" అంటారు. సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరమాసం నాడు 
ఈ పూజను ఆచరించడము సర్వశ్రేష్టము. 
ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశరమహర్షి,నారదుడికి తెలిపారు.

మార్గశిర నెలలో,లక్ష్మీ పూజ చేసుకొని..
ఈ వ్రతమును ఆచరించుటవల్ల... 
ఋణ సమస్యలు తొలగి, శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం.

మార్గశిరలక్ష్మివారవ్రత విధానం:?

మార్గశిరలక్ష్మివారవ్రత పూజావిధానం,
దీపావళి లక్ష్మీపూజ మరియు 
వరలక్ష్మిపూజ వలే ఉన్నప్పటికిని… అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది.

మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాలలో 
ఉదయమునే నిద్రలేచి ఇళ్ళు శుభ్రం చేసి, 
తలస్నానం చేయవలెను(తలంటు కుంకుడు)షాంపుతో చేయరాదు.
ప్రత్యేకించి పూజ ముగిసే వరకు, 
తలకు నూనే రాసుకొనుట, దువ్వుకోనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహంను పూజకు సిద్ధం చేసుకోవలెను.

'ఆదౌ పూజ్యో గణాధిపః' అని మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. 
గణపతి పూజ అనంతరం, 
లక్ష్మీ అమ్మవారికి అధాంగ, షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. 
నెల రోజులు ప్రతి గురువారం ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. 
మార్గశిర లక్ష్మీ పూజ, కథ చదువుకొని అక్షతలను శిరస్సున ధరించాలి.

లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురవారాలు చేస్తారు. కేవలం నాలుగు గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో వుంటాయి 
కానీ ఈ లక్ష్మి పూజ పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా పూజ చేయాలి 
అదే ఇక్కడ విశేషం.

అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాల్లో..పూజ చేసుకుని..పుష్యమాసం లో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి.
బూర్లు(పూర్ణాలు) నివేదన చేయవలెను.

ఆరోజు కూడా అమ్మవారి పూజ చేసుకుని..
కథ చదువుకుని అక్షింతలు తలపై వేసుకోవాలి.
ఒక ముత్తైదువును పిలిచి..భోజనం పెట్టి..
9బూర్లు(పూర్ణాలు) పెట్టి దక్షిణ తాంబూలాలు...ఇవ్వవలెను.
శక్తి ఉన్నవారు..చీర కూడా పెట్టవచ్చును.లేకపోతే జాకెట్టు ముక్కతో సరిపెట్టవచ్చును.

మార్గశిర లక్ష్మివార వ్రతం సమయంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యములు:

1 వ గురువారం – పులగం 
2 వ గురువారం – అట్లు, 
3 వ గురువారం – అప్పాలు,లేదా పరమాన్నము
4 వ గురువారం – చిత్రాన్నం, లేదా గారెలు
5 వ గురువారం – పూర్ణం బూరెలు

మార్గశిర లక్ష్మివార వ్రత కధ:?

పూర్వం కళింగ దేశమందు ఒక బ్రాహ్మణుడు కలడు. అతనికి సుశీల అను ఒక కూతురు కలదు.
ఆమెకు చిన్నతనమున తల్లి చనిపోయినందున 
సవతి తల్లి పిల్లను ఎత్తుకొమ్మని చెప్పుచు కొంచెం బెల్లం ముక్క యిచ్చేది.

ఆసుశీల సవతి పిల్లలను ఆడించుచు ఇంటివద్ద సవతితల్లి మార్గశిర లక్ష్మి పూజ చేయుట చూసి 
ఆమె కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జిల్లేడు పూలతోను ఆకులతోను పూజచేసి ఆడుకోమని ఇచ్చిన బెల్లం నేవైధ్యం పెట్టుచూ ఆడుకునేది సుశీల.

ఇలా కొన్నాళకు సుశీలకు వివాహం అయ్యింది. అత్తవారింటికి పోవుచూ తాను తయారు చేసుకున్న 
లక్ష్మి దేవి మట్టి బొమ్మను తీసుకు వెళ్ళింది. 
ఇలా వెళ్ళిన వెంటనే కన్నవారు నిరుపేదలు అయినారు.

ఈమె ఇంట మహదైశ్వైర్యం అనుభవిస్తున్నారు. పుట్టింటివారు కటిక దరిద్రులు అయిన సంగతి తెలిసికొని సుశీల చాలా బాధపడుతుంది. 
తల్లి దరిద్రమును భరించలేక కొడుకును పిలచి నాయనా! నీ అక్క ఇంటికి వెళ్లి ఏమైనా డబ్బు తీసుకురమ్మని చెప్పి పంపించెను.

సుశీలఇంటికి తమ్ముడు వెళ్లి వారి దరిద్రం గురించి చెప్పాడు. 
దరిద్రమును తెలుసుకున్న సుశీల ఒకకర్రను దోలిపింఛి దాని నిండా వరహాలు పోసి అతనికి ఇచ్చింది. ఆచిన్నవాడు కర్రను పట్టుకొని వెళుతుండగా దారిలో కర్రవదిలి వెళ్ళిపోయాడు. 
ఆకర్ర ఎవరో తీసుకొని వెళ్ళిపోయారు. 
ఇంటికి వెళ్ళిన కొడుకుని తల్లి ఏమితెచ్చావు అని అడుగగా ఏమితేలేదు అని చెప్పెను. 
మనదరిద్రం ఇంతే అని అనుకున్నారు.

కొంతకాలం తరువాత సుశీల తమ్ముని పరిస్థితిని అడిగి తెలుసుకున్నది. 
వారి దరిద్రంలో ఎటువంటి మార్పురాలేదని తెలిసి. ఒక చెప్పులు జత తెప్పించి వాటిలో వరహాలు పోసి కుట్టించి వాటికి గుడ్డ చుట్టి తమ్మునికి ఇచ్చి అది తీసుకునివెళ్లి తండ్రికి ఇమ్మని చెప్పెను. 
సరే అని తీసుకునివెళ్లి మార్గమద్యలో దాహంవేసి 
ఒక చెరువుగట్టును చెప్పులు మూట పెట్టి నీరు తాగి వచ్చేసరికి ఎవరో వాటిని తీసుకునిపోయారు. 
జరిగిన విషయం తల్లికి చెప్పాడు. 
తల్లి జరిగిన దానికి భాదపడి మనదరిద్రం ఇలాగెందుకు ప్రాప్తించిందో అనుకొనెను.

మరలా కొన్నాళ్ళకు కొడుకును పంపిస్తూ ఈసారి అయినా జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పెను. 
అక్కకు పరిస్థితి ఇదివరకు ఉన్నట్టే వుందని చెప్పెను. అప్పుడు సుశీల ఒకగుమ్మడి పండు తెప్పించి తొలచి 
దాని నిండా వరహాలు నింపి ఆ పండు అమ్మకి ఇమ్మని చెప్పింది. 
సరే అని తీసుకువస్తుండగా సాయంసమయంలో ఒక చెరువు వద్దకు వచ్చి దానిని గట్టుమీద వుంచి సాయంసంధ్య వందనం చేస్తూవున్నాడు. 
ఇంతలో ఒక బాటసారి పండు బాగుందని ప

ట్టుకుని వెళ్ళిపోయెను. 
ఆకుర్రవాడు గట్టుమీదకు వచ్చి పండు వెతకగా పండులేదు. 
ఏమిచేసేది లేక ఇంటికి వెళ్ళాడు. 
తల్లి ఏమి తెచ్చితివి అని అడుగగా జరిగినది చెప్పెను. తల్లి విచారించింది.

కొన్నాళ్ళకు...తల్లి ఇంటిదగ్గర పిల్లలను వుంచి కూతురు దగ్గరకు వెళ్ళెను. 
తల్లిని చూసి సుశీల వారి దరిద్రమును తెలుసుకొని చింతిచి మార్గశిర లక్ష్మివారం నోము నోచిన ఐశ్వర్యం వచ్చునని తలచినది. 
అమ్మా ఈరోజు మార్గశిర లక్ష్మివారం నోటిలో ఏమి వేసుకోకు మనం వ్రతం చేసుకుందాం అని చెప్పెను. 
ఆమె కూడా అలాగే నేనేమైనా చిన్నదాననా? 
ఎందుకు తింటాను అని చెప్పి పిల్లలకు చల్ది అన్నంపెట్టి నోటిలో ఒకముద్ద వేసుకున్నది.

కూతురు వచ్చి అమ్మా స్నానం చెయ్యి మనం వ్రతం చేసుకుందాం అంది. 
అప్పుడు జరిగినది తల్లి చెప్పినది. 
ఆ వారం కూతురు మాత్రమే చేసుకున్నది. 
రెండవ వారం వ్రతం చేసుకుందాం అనుకున్నది 
అప్పుడు పిల్లలకు తలకి నూనె రాస్తూ తానును రాసుకున్నది. 
ఆవారం కూడా వ్రతం చేయవీలుకాలేదు.

మరుసటి వారం అమ్మా ఈసారైనా జాగ్రత్తగా వుండమని చెప్పినది. 
పిల్లలకు తలదువ్వుతూ ఆమె కూడా తలదువ్వుకొని వ్రతం చేయలేకపోయినది. 
కూతురు మాత్రమే చేసుకున్నది.

నాలగవ వారం ఈసారి అయినా చాలా జాగ్రత గా వుండమని చెప్పి సుశీల...తల్లి ఏపని చేయకుండా వుండటానికి ఒకగోతి లో కూర్చోబెట్టినది. 
పని అయిన తరువాత అమ్మను తెచ్చుకుని వచ్చి 
స్నానం చేస్తే పూజచేసుకుందాం అని పిలవగా..
తల్లి..పిల్లలు అరటిపండు తిని నేను కూర్చున్న చోట అరటి తోలు వేసారు 
నేను తోచక అది తిన్నా అని చెప్పింది. 
అయ్యో అని తలచి కూతురు పూజచేసుకొనెను.

ఐదవ వారం మార్గశిర లక్ష్మివారం వ్రతం..ఆఖరి వారం . అప్పుడు సుశీల తల్లిని తనకొంగుకు కట్టుకొని పని పూర్తి చేసుకొని తల్లిచే స్నానం చేయించి వ్రతం చేయించింది. పూర్నకుడుములు తల్లిచే నైవేద్యం పెట్టించింది. 
కానీ మహాలక్ష్మి దూరంగా వెళ్లిపోయినది.

ఏమి అమ్మ అలా వెళ్ళిపోతున్నావు అని అడుగగా…. 
నీ చిన్నతనం లో నీవు బొమ్మలు తో ఆడుకుంటుంటే 
మీ అమ్మ చీపురుతో కొట్టింది అందుకే అని చెప్పింది. అప్పుడు తన తల్లి చేసినదానికి క్షమించమని ప్రార్ధించింది.

మళ్ళీ నీ తల్లిచే వ్రతం చేయించమని అదృశ్యము అయ్యినది మహాలక్ష్మి. 
సరే అని మొదటివారం పులగం, 
రెండవ వారం అట్లు, తిమ్మనం, 
మూడవ వారం అప్పాలు, పరమాన్నము, 
నాల్గవ వారం చిత్రాన్నం, గారెలు, 
పుష్యమాసం లో మొదటి వారం లో పూర్ణపుకుడుములు వడ్డించి తల్లిచే నోము చేయించింది. 
కధా అక్షింతలు తలమీద వేసుకున్నారు. 
అప్పటినుండి ఆమెకు సకలసంపదలు కలిగి అంత్యమందున విష్ణులోకమునకు వెళ్ళెను.

కధలోపమైనను, వ్రతలోపముకారాదు. 
భక్తి తప్పినను, ఫలముతప్పదు.
ఓం శ్రీ మహాలక్ష్మీ దేవై నమః..!!?

సర్వే జనా సుఖినోభవంతు..!!?