భక్తి.. జ్ఞానం

భక్తి, జ్ఞానం వేరు కాదు, రెండూ ఒకటే. భగవంతుని యందు నిజభక్తి కలిగినవాడే జ్ఞాని. మనోలయ సాధనకు మనసు శుద్ధత్వంతో నిండిపోవాలి. రజో, తమో గుణాలున్నంతకాలం, అహంకార మమకారాలు నశించవు. మనోలయ సాదనలో మరపు-తెరపుగా కలిగే ఆత్మానుభవం నిలకడ చెందాలంటే, మనసు కేవల సత్వగుణ ప్రధానంగా నిర్మల, నిశ్చల స్థితిలో ఉండాలి. పూర్ణసత్వం ఏర్పడాలంటే, భగవంతుని యందు భక్తి కలిగి ఉండాలి. ‘భ’ అంటే వెలుగు. ‘క్తి’ అంటే కూడి ఉండటం. పూజలు, వ్రతాలు, దీక్షలు వంటివన్నీ భక్తి మార్గంలో మలుపులు, దశలు. వీటన్నిటి లక్ష్యమూ వెలుగుతో కూడి ఉండటమే.

దీనికి శరణాగతి ప్రధానం. శరణాగతి వలన అహంకార మమకారాలు నశించి.. అంటే రజస్తమో గుణాలు అంతరించి, సత్వగుణం మిగులుతుంది. ఈ స్థితిలో వినయం ఏర్పడుతుంది. సమర్పణ, శరణాగతి, వినయం, భక్తికి మూడు ముఖాలు. భక్తివలన మనోమాలిన్యం తొలగి, స్వచ్ఛత లభిస్తుంది. కోరికలనే ధూళివలన మనసనే అద్దం మసకబారుతుంది. ధూమం తొలగితేనే అద్దం స్వచ్ఛంగా ఉంటుంది. స్వచ్ఛమైన మనస్సు, ఆత్మను తేజస్సుగా ప్రతిబింబించగలుగుతుంది.

‘సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని భక్తి రెండు విధాలు’ అంటుంది బృహదారణ్యకం. మోక్షానికి ఈ రెండు మార్గాలూ అనుసరించతగినవే. ముందుగా స్థూలంగా ఉండే సగుణ భక్తి, సాధనా క్రమంలో సూక్ష్మంగా ఉండే నిర్గుణ భక్తికి దారి తీస్తుంది. బ్రహ్మచారి, గృహస్థు, వానప్రస్థుడు, సన్యాసి వంటి వారందరూ స్థూల భక్తికి చెందినవారే. భగవంతుణ్ణి సగుణోపాసనామార్గంలో అర్చించి, ఆరాధించి, అలంకరించి, ఊరేగించి, వేడుకలలో, జాతరలలో, ఆనందం పొందంటం, నవవిధ భక్తి మార్గాలలో ఆయనను ఉపాసించటం, అసత్యం పలకకుండా ఉండటం, పరస్త్రీలను కోరకుండా ఉండటం, ఇతరుల ధనంపై ఆశ లేకుండా ఉండటం, దుర్భాషలాడకుండా ఉండటం, పుణ్యక్షేత్ర దర్శనం, పుణ్యనదీ స్నానం, ఇవన్నీ సాధించుకున్న భక్తుడి హృదయంలోకి భగవంతుడు, నెమ్మదిగా ప్రవేశిస్తాడు, ఒక భాగంగా!

‘‘భగవంతుడు అందరియందున్నాడు కనుక ఎవరినీ ద్వేషించకూడదు. సర్వజీవుల యందు దయకలిగి ఉండాలి. పరిపూర్ణ తృప్తీ, నాది, నేను అనే భావం విడనాడాలి. అహంకారం, దంభం, కోపం వదులుకోవాలి. మృదుమధురంగా మాట్లాడటం, నిర్మల మనసు కలిగి ఉండటం, అత్మస్తుతి, పరనింద ఎరుగని భావస్థితి వుండటం, సుఖదుఖాలను, స్థితిగతులను సమంగా అనుభవించగలగటం, ఆపేక్షను వదిలి, ఉపేక్షను అలవాటు చేసుకోవటం, దైవచింతన, నామస్మరణ నిరంతరం సాగించటం... ఇవన్నీ భక్తి ద్వారా సాధించుకోవాలి. అప్పుడే, మనసు మదమెరుగని, నిశ్చిత భూమికలో ఉండగలుగుతుంది. ఇదే ‘మహాభావసమాధి’ స్థితి. లేదా పూర్ణ మనోలయం, అదే జ్ఞానం. భగవంతునని యందున్న తీవ్ర, నిశ్చల, నిర్మల భక్తే జ్ఞానంగా పరిణమించి, పరిమళిస్తుందన్నమాట. ధ్యానం, ఏకాగ్రత వంటివి మహాభావస్థితికి దివ్వ మార్గాలు. రెండూ మనసును పవిత్రీకరించుకునే సాధనాలే!