మాఘపురాణం - 11వ అధ్యాయం

మార్కండేయుని వృత్తాంతము 
వశిష్ఠుడుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మృకండు జననం, కాశీవిశ్వనాథుని దర్శనం, విశ్వనాధుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి – 
మహారాజా! ఇక మార్కండేయుని గురించి వివరింతును. శ్రద్ధగా ఆలకింపుము అని వశిష్ఠుల వారు ఈవిధంగా చెప్పదొడగిరి. మార్కండేయుని ఆయువు పదహారు సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగుచుండెను. అయిదేళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తిచేసిరి. ఆరవయేడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించిరి. అతడు తన తండ్రివలెనే అచిరకాలములోనే సకల శాస్త్రములు, వేదాంత, పురాణ, ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడని ప్రశంసలనందెను. “కుమారా! నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలతచే అందరి మన్ననలను పొందుచున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను, గురువులయెడ పెద్దలయెడ బ్రాహ్మణులయెడ మరింత భక్తిభావంతో మెలగవలయును. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. గాన నీవట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధియగును” అని చెప్పిరి.
అటుల పదిహేను సంవత్సరములు గడిచిపొయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయం ఎక్కువగుచున్నవి. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెననీ తలచి మహాఋషులందరకు ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చిరి. అందుకు మృకండుడానందమొంది అతిథి సత్కారములు జేసెను. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరకు నమస్కరించాడు. అటులనే వశిష్ఠునకు నమస్కరించగా, అతడు మార్కండేయుని వారించెను. అటుల చేసినందులకు అందరూ ఆశ్చర్యపడి “మహానుభావా! మీరట్లు వారించుటకు కారణమేమి?” అని ప్రశ్నించారు.
అంత వశిష్ఠుల వారు “ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఈతనిని “దీర్ఘాయుష్మంతుడవు కమ్ము” అని దీవించితిరి గదా! అదెటుల అగును? ఈతని ఆయుర్దాయము పదహారేండ్లే కదా! ఇప్పుడు పదిహేనవ జన్మదినోత్సవము జరుపుతున్నారు. పరమేశ్వరుడిచ్చిన వరము ప్రకారము యీతడు ఒక్క సంవత్సరమే జీవించును” అని నుడివిరి. అంతవరకూ మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాల విచారించిరి. “చిరంజీవివై వర్ధిల్లు”మణి దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి “దీనికి మార్గాన్తరము లేదా? యని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి “మునిసత్తములారా! వినుడు. మనమందరము యీ మార్కండేయుని వెంటబెట్టుకొని బ్రహదేవుని వద్దకు పోవుదము.రండి” అని పలికి తమవెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. 
మునీశ్వరుల ఆగమనమునకు బ్రహ్మ సంతసించెను. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ “చిరంజీవిగా జీవించు నాయనా”యని దీవించెను. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మ వృత్తాంతమును బ్రహ్మకు వివరించెను. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి “భయపడకు” అని మార్కండేయుని దగ్గరకు జేరదీసి “పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా జేయును గాక”యని తన మనస్సులో శివుని ధ్యానించెను. అంతట మునులవంక జూచి ఓ మునులారా! మీరు పోయిరండు. ఈతనికి ఏ ప్రమాదమూ జరుగనేరదు.అని పలికి, వత్సా! మార్కండేయా! నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సదా విశ్వనాథుని సేవించుచుండుము. నీకేయాపదకలుగదు. గాన నీవట్లు చేయుము. 
మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీవిశ్వనాథుని సేవించి వచ్చెదను. అనుజ్ఞ నిమ్మని కోరగా మృకండుడు అతని భార్యయు కొడుకుయొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక కుమారుని విడిచిపెట్టి యుండలేక అందరూ కాశీక్షేత్రమునకు బయలుదేరిరి. 
కుటుంబ సహితంగా కాశీకిపోయి మృకండుడు కాశీవిశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యానపరులై రాత్రింబవళ్ళు శివలింగముగడనే యుండెను. పదహారవయేడు ప్రవేశించెను. మరణ సమయమాసన్నమైనది. యముడు తన భటులతో “మార్కండేయుని ప్రాణములు గొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు గొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము జేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చుసరికి భటులు ఆ సమీపమందు నిలువలేకపోయిరి. కాలపాశము విసరుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించినది. ఆ తేజస్సు యమభటులపై అగ్నికణముల వలె బాధించెను. ఆ బాధకోర్వలేక భటులు పోయి జరిగిన వృత్తాంతమును యమునా కెరిగించగా యముడాశ్చర్యపడి తానే స్వయముగా మార్కండేయునిపై కాలపాశము విసరెను. మార్కండేయుడు కన్నులు తెరచి చూచుసరికి యముడు తన ప్రాణమును తీసుకుపోవ సిద్ధముగా నుండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగలించుకొని ధ్యానించు సరికి కైలాసవాసుడగు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహా రౌద్రాకారముతో శివలింగమును చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంవారించి మార్కండేయుని రక్షించెను.
యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకురు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుననేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి మహేశా! యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి పదహారేండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి గదా! అతనిని ఆయువునిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చెను. మార్కండేయుని చిరంజీవిగా జేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నారము. గాని ధర్మ పాలన నిమిత్తం యముడు లేకుండుట లోటుకదా! గాన మరల యముని బ్రతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యముని బ్రతికించి “యమా! నీవు నా భక్తుల దరికి రావలదుసుమా!” అని పలికి అంతర్ధానమయ్యెను.
పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడయినందులకు మృకండుడు మిక్కిలి సంతసించి తానూ చేసిన మాఘ మాస ఫలమే తన కుమారుని కాపాడినదని మాఘమాస ప్రభావం లోకులందరకు చెప్పుచుండెను.

చిత్రంలోని అంశాలు: 3 మంది వ్యక్తులు, లోపలి ప్రదేశం