గోమాత జననం

ఆవు పుట్టుక గురించి శతపథ బ్రాహ్మణంలో ఉంది. దక్ష ప్రజాపతి ప్రాణి సృష్టి చేసిన పిమ్మట కొంచెము అమృతమును త్రాగారు. త్రాగిన తరువాత వారు ప్రసన్నమయ్యారు. ఆ సమయములో వారి శ్వాస ద్వారా సుగంధము వెలువడి అంతటా ప్రసరించినది. ఆ శ్వాస నుండి ఒక్క ఆవు జన్మించినది. సుగంధము ద్వారా జన్మించుట వలన దక్షప్రజాపతి దానికి ‘సురభి’అని పేరు పెట్టారు. సురభి నుండి అనేక ఆవులు జన్మించాయి. అందుకనే సురభిని గోవంశమునకు మాతగా, జననిగా పరిగణిస్తారు.

ఋగ్వేదంలో వేదంలో 4వ కాండలో 12వ సూక్తం గోసూక్తంగా గోమాత యొక్క మహత్యం వివరించబడింది. శ్రీసూక్తం, పురుష సూక్తం, మన్యు సూక్తం లాంటి పవిత్ర సూక్తాలతోపాటు గోసూక్తం కూడా చెప్పబడింది. గోవు రుద్రులకు తల్లిగా, వసువులకు పుత్రికగా, ఆదిత్యులకు సోదరిగా, నెయ్యి రూపాన అమృతంగా చెప్పబడింది.

ఋగ్వేదంలో ఆవును ‘‘అఘణ్య’’ అన్నారు.
సముద్ర మధనము నుండి దేవతల కార్యసిద్ధికై, సాక్షాత్తు సురభి బయల్వెడలినది. సంతోషముగా ఉన్నది, కపిల వర్ణముగలది, పొదుగు బరువు చేత నెమ్మది, నెమ్మదిగా అలలపై నడుస్తూ వచ్చుచున్న కామధేనువును చూచిన దేవతలంతా గొప్పకాంతిగల ఆ ఆవుపై పుష్పములు కురిపించిరి. అపుడు అనేక విధములు వాధ్యములు, తూర్యములు మ్రోగింపబడినవి. లోకములో గోసంతతి వ్యాపించడానికి ఆమెయే ఆధారం. ఆ సురభి రోమకూపాలనుంచి కొన్ని లక్షల సంఖ్యలో గోవులు పుట్టాయి. వాటి మగ సంతతి వృషభాలు.

.‘‘గావః విశ్వస్య మాతరః గవా మాంగేషు తిష్ఠంతి భువనాని చతుర్దశ’’

ఆవు విశ్వజనులందరికీ తల్లి వంటిది. గోవు నందు చతుర్దశ భువనాలున్నాయని వేదం చెబుతుంది. అంటే గోవు పృథ్వీ రూపమని అర్థం.

క్షీర సాగరమధన సమయంలో నంది, శుభద్ర, సురభి, సుశీల, బహుళ అనే అయిదు గోవులు ఉద్భవించాయని భవిష్యపురాణం తెలియజేస్తుంది. వీటినే కామధేనువులు అంటారు.
వంద గోవుల చేత కూడివున్న ఆ ధేనువు, సురభిని నీటి మధ్య నుండి తీసుకొని వచ్చిరి. ఆ గోవులు దట్టమైన నీలిరంగులోనూ, నలుపు రంగులోనూ, ధూమ్రవర్ణములోను, బభ్రు వర్ణములోను, శ్యామ వర్ణములోనూ, ఎరుపు రంగు, పింగళ (చిత్ర) వర్ణములోనూ ఉండినవి. - స్కాంద పురాణము.

గోశబ్దము స్వర్గమునకు, బాణమునకు, పశువునకు, వాక్కునకును, వజ్రాయుధమునకును, దిక్కునకును, నేత్రమునకును, కిరణమునకును, భూమికిని, నీళ్ళకును పేరు.
‘‘ధేనునా మస్మి కామధుక్’’ అని గీతలో శ్రీకృష్ణుడు నేనే గోవునని చెప్పుకున్నాడు. గోవు లక్ష్మీ స్వరూపం. దీనికి ఒక పురాణ గాధ ఉంది. దేవతలందరూ వచ్చి గోవుతో తల్లీ మేమందరం నీ శరీరంలో నివసించడానికి కొంచెం భాగం ఇవ్వమని ప్రార్థిస్తే గోవు దేవతలందరికి భాగం ఇవ్వడం జరిగింది.

సురభి ఒక్కసారి తపస్సునారంభించనది. బ్రహ్మ దేవుడు ఆ తపస్సునకు మెచ్చి సంతుష్టుడయ్యారు. సురభికి అమరత్వమును ప్రసాదించారు. త్రిలోకముల కన్నా పైన ఉండే స్వర్గమును వరముగా ఇచ్చారు. దీనిని స్వర్గ గోలోకమనే పేరుతొ పిలుస్తారు. గోలోకములో సురభి నిత్యమూ నివసిస్తుంది, ఈమె కన్యలు, సుకన్యలు భూలోకములో నివసిస్తారు. ఈ గోలోకమునకు అధిపతి గోవిందుడు అనగా శ్రీ కృష్ణుడు. శ్రీకృష్ణ పరమాత్ముడు ‘గోప్రేమికుడు’ అని అంతటా ప్రాచుర్యమైనదే!
స్పర్శ మాత్రము చేత గోవులు సర్వ పాపముల నుండి మానవులను విముక్తులను చేస్తాయి. ప్రతి దినమూ స్నానం చేసి గోవును స్పృశించినవాడు సర్వపాపాల నుండి విముక్తుడౌతాడు.
గోమయములో లక్ష్మీ దేవి, గోమూత్రములో గంగాదేవి నివాసముంటారు. గోమూత్రము, గోమయాలతో నేల పరిశుద్ధము, పరిపుష్ఠము అవుతుంది. గోమయమును అగ్నితో శుద్ధి చేసిన యెడల ఆ భస్మమే విభూతి యగును.
ప్రతిదినము ఆవులకు నీరు త్రాగించి గడ్డిని మేతగా తినిపించేవారికి అశ్వమేధ యజ్ఞం చేసినంత చేసిన పుణ్యం వస్తుంది.

‘‘ఒక గోవు తన జీవితకాలంలో సగటున 25వేల మందికి ఆకలి తీరుస్తుందని చెబుతూ గోవును వధిస్తే ఆ రాజ్యంలో అరాచకం పెరిగి ప్రజలు నశిస్తారని చెప్పారు. మనం తల్లిగా భావించే ఈ గోవుతో రోజు కొన్ని క్షణాలు వాటికి మేత పెట్టడం, వాటితోపాటు కొంత సమయం గడపటంవల్ల, మన శరీరంలో వున్న అనారోగ్యాన్ని, ఆ గోవు ముక్కులోవున్న ఒక గ్రంథి ద్వారా గ్రహిస్తుంది, తరువాత మేతకు వెళ్ళినప్పుడు మన రోగ నివారణకు కావలసిన మూలికలను, గడ్డిని తిని, అందుకు తగిన విధంగా పాలు ఇస్తుంది, ఆ పాలు తాగడంవల్ల మన వ్యాధి నయం అవుతుంది. గోమాత - కీర్తనం శ్రవణం దానం, ధర్మం, గోరక్షణం, గోరక్షణ ప్రోత్సాహం, గోరక్షణ ప్రోత్సాహక ప్రేరణం… అన్నీ పుణ్యప్రదమైనవే..


గోమాత పాదాలకు శతకోటి వందనాలు